కలం, నల్లగొండ: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ నియోజకవర్గాల్లో కీలక నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన పతనం ఇప్పటికే ప్రారంభమైందని జోస్యం చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన ఆయన, త్వరలోనే రాష్ట్రంలో తమిళనాడు తరహా విప్లవాత్మక రాజకీయ మార్పులు తీసుకొస్తానని వ్యాఖ్యానించారు.
“నా తదుపరి టార్గెట్ ముఖ్యమంత్రి పదవే. పదవి అనేది కేవలం అలంకారం కాదు, అదొక పెద్ద బాధ్యత. పేదలకు, నిరుద్యోగులకు, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ప్రజలు మెచ్చే పనులు చేసినప్పుడే ఒక వ్యక్తి నిజమైన నాయకుడు అవుతాడు.” అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
తమిళనాడు రాజకీయాలను స్ఫూర్తిగా తీసుకుని, అక్కడ విజయన్ అందించిన పాలన తరహాలోనే తెలంగాణలోనూ పూర్తి అవినీతి రహిత పాలన అందిస్తానని పేర్కొన్నారు. తన ఆశయాలకు పార్టీలకతీతంగా వివిధ రాజకీయ నేతల నుంచి, అలాగే ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలపై నేరుగా పోరాటం చేస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై స్వపక్షంలోనే ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

