కలం, నల్లగొండ : వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా చివరి శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Nalgonda Collector Chandrasekhar) కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వారి నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ ప్రత్యేక ప్రజావాణికి 64 మంది వయో వృద్ధులు, దివ్యాంగులు హాజరై దరఖాస్తులు సమర్పించారు. ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, పిల్లలు తల్లిదండ్రులను చూడని కేసులు, భూములు తదితర కేసులు కలెక్టర్ దృష్టికి వచ్చాయి. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ, మునుగోడు సీడీపీవో లావణ్య తదితరులు ఉన్నారు.

