కలం, నల్లగొండ: దేవరకొండ నియోజకవర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యం కొనుగోలు కంప్లీట్ చేయాలని నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ (Collector Chandrasekhar) సూచించారు. శనివారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్తో కలిసి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిపోయిన ధాన్యం కొనుగోళ్లు వచ్చే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
దేవరకొండ డివిజన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మిల్లర్ల సమన్వయం ద్వారా ధాన్యం వేగంగా మిల్లులకు తరలించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు, అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం కళ్లాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరితగతిన తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని, ఇప్పటి వరకు రూ.487 కోట్లు చెల్లించామని తెలిపారు. డివిజన్ పరిధిలోని 12 మిల్లులకు చెందిన మిల్లర్లు ధాన్యం సేకరణలో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70 లారీలు సరిపోకపోతే మరిన్ని లారీలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఏ కేంద్రంలో ధాన్యం ఎక్కువగా ఉంటే అక్కడికి వెంటనే లారీలు పంపిస్తామని చెప్పారు. సమీక్ష సమావేశనికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఇంచార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, డీఎం రాంపత్తి నాయక్, డీసీఓ పత్యా నాయక్ , మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డిటి ముబీన్,రైస్ మిల్లర్ల తరఫున వెంకన్న, శ్రీనివాస్, అధికారులు, తదితరులు హాజరయ్యారు.

