కలం, వెబ్ డెస్క్: మెటా (Meta) నిర్వహిస్తున్న వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాలో పోస్ట్ అవుతున్న ఫేక్ కంటెంట్ అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీప్ ఫేక్, ప్రచారాత్మకమైన కంటెంట్, ఇతరుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వాడుతున్న కంటెంట్ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మెటాకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన రోడ్ మ్యాప్ను మంత్రిత్వ శాఖకు అప్పగించాలని సూచించింది. ఫేక్ కంటెంట్ లోడ్ అయ్యేలా ఉపయోగిస్తున్న అన్ని అల్గారిథమ్లను పునర్వ్యవస్థీకరించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
అనేక లోపాల గుర్తింపు..
ప్రధాని మోదీ వీడియో ఫేస్బుక్లో నిలిపివేసినప్పటి నుంచి మెటాపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా ప్లాట్ఫారాల్లో జరుగుతున్న వ్యవహారాలను క్షుణ్ణంగా సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మెటా ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు పోస్ట్ అవుతున్న కంటెంట్ను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తాము అనుసరిస్తున్న విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఇప్పటికే మెటా ప్రతినిధులు అంగీకరించారు. డీప్ ఫేక్, సింథటిక్ కంటెంట్ను నిరోధించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అశ్వినీ వైష్ణవ్ మెటాకు సూచించారు. త్వరలోనే మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు.

