కలం, నల్లగొండ బ్యూరో : ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) పేర్కొన్నారు. మండల కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన (Vemula Veeresham) మాట్లాడుతూ, రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయించుకున్నామని, త్వరలోనే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల కోసం నూతన భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత-శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

