కలం, కరీంనగర్ బ్యూరో : లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సురక్షితమైన వాతావరణంలో చేయూతను అందించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ‘భరోసా’ కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర అడిషనల్ డీజీపీ (సీఐడీ అండ్ ఏసీబీ) చారు సిన్హా (Additional DGP Charu Sinha) అన్నారు. గురువారం కరీంనగర్ (Karimnagar) జిల్లా పర్యటనలో భాగంగా కొత్తపల్లిలో ఉన్న భరోసా కేంద్రాన్ని ఆమె సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ప్రతి విభాగాన్ని సందర్శించిన సిబ్బందితో మాట్లాడి పనితీరును సమీక్షించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించడంలో ఏమాత్రం జాప్యం జరగకూడదని ఆమె స్పష్టం చేశారు.
శిక్షల శాతం పెరగాలి..
తెలంగాణ పోలీసు శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పక్కాగా ఆధారాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చారు సిన్హా (Charu Sinha) సూచించారు. 2024 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ కేంద్రం, బాధితులకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులకు తిరిగే ఇబ్బంది లేకుండా ఒకే చోట అన్ని సేవలు అందించడం అభినందనీయమన్నారు. తనిఖీ అనంతరం భరోసా కేంద్రం ఆవరణలో డీజీపీ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పుల్లయ్య, ఎస్సై అనూష, భరోసా కేంద్రం సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Read Also: పొలిటికల్ యాత్రలతో ఓట్లు రాలేనా?
Follow Us On : WhatsApp

