కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. అసెంబ్లీ మండలి హాల్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దాదాపు 10 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య జరిగిన ఈ పర్సనల్ మీటింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి గత కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ తీరుపై కొంత అసంతృప్తితో ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామంటూ మోసం చేశారంటూ పార్టీ అధిష్టానంపై వీలుచిక్కినప్పుడల్లా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగానూ వ్యవహరించిన సందర్భాలు లేకపోలేదు. అయినా ఏనాడూ కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఇటీవల మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి తగిన ప్రాధాన్యత దక్కుతుందా..? లేదా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
భేటీపై సర్వత్రా ఆసక్తి..
కేవలం 10 నిమిషాల పాటే ఈ సమావేశం జరిగినప్పటికీ ఇది పూర్తిగా వ్యక్తిగత, రాజకీయ ప్రాధాన్యత ఉన్న భేటీగా భావిస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ లాబీల్లో కలిసినప్పుడు కాకుండా నేరుగా సీఎం ఛాంబర్లోకి వెళ్లి ఏకాంతంగా చర్చలు జరపడం అంటే.. అది నియోజకవర్గ సమస్యల కంటే కూడా రాజకీయ భవిష్యత్తుపైనే అయ్యి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ తమదైన శైలిలో దూకుడుగా ఉంటారు. రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ద్వారా సీఎం ఆయనకు ఏదైనా భరోసా ఇచ్చారా? లేక రాజగోపాల్ రెడ్డి తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసిందని చెప్పాలి.
Read Also: లక్షా డెబ్బై ఐదు వేల బియ్యపు గింజలపై శ్రీరామ నామం..
Follow Us On: Instagram

