కలం, నల్లగొండ బ్యూరో: వైఎస్సార్ సీఎంగా పనిచేసిన సమయంలో కొట్లాడి మరీ ఉదయ సముద్రం (Udaya Samudram) ప్రాజెక్టును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) తెలిపారు. 90 శాతం పూర్తయిన బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టును కావాలని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పక్కన పెట్టిందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 10 శాతం పనులని పూర్తిచేసి భూ సేకరణ ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తిచేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పంపులను ఓపెన్ చేశామని గుర్తుచేశారు. డిండి ఎత్తిపోతల (Dindi Project) పథకంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కడి నుండి నీటిని తీసుకురావాలనే అంశాన్ని వదిలిపెట్టి.. కేవలం కమిషన్ల కోసమే అప్పటి టీఆర్ఎస్ రిజర్వాయర్లు కట్టి వదిలిపెట్టిందన్నారు. మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి రూ.1800 కోట్లను మంజూరు చేయించానని, ఆ పనులు సైతం మొదలయ్యాయన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు నుంచి మునుగోడు మండలంలోని గ్రామాలకు శాశ్వతంగా సాగు, తాగునీరు అందించడానికి భూసేకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్ధంగా నిజాయితీగా పని చేస్తున్నానన్నారు. ఇటీవల కొంతమంది తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారని రాజగోపాల్ (Raj Gopal Reddy) పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవాలి.. రాజకీయాలు లేనప్పుడు అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 31 సబ్ స్టేషన్లు నిర్మాణమైతే.. మా ప్రజా ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లోనే 24 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతానికి 132 కెవి సబ్ స్టేషన్లు మూడు ఉండగా.. మరో మూడు 132 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేయించానని తెలిపారు. రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మునుగోడు నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య లేకుండా చూడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.
Read Also: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొగడ్తల వర్షం
Follow Us On : WhatsApp

