కలం,ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) సరిహద్దుల్లో మరోసారి విలీన అంశం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు స్థానికులు, జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు భద్రాచలం పరిధిలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు పోలవరం ఆర్డినెన్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలు మళ్లీ తెలంగాణలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ‘మా గ్రామాలు మాకు కావాలి.. మమ్మల్ని తిరిగి తెలంగాణలో కలపాలి’ అంటూ పోరాట బాట పట్టారు.
భౌగోళికంగా, సామాజికంగా భద్రాచలంతో అనుబంధం ఉన్న కన్నాయిగూడెం, పిచుకలపాడు, ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భద్రాద్రి శ్రీరాముడి ఆలయానికి చెందిన భూములు పరాయి రాష్ట్రంలో ఉండటం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం హరిత టూరిజం వద్ద తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkata Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం (Bhadrachalam) చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉండటం అభివృద్ధికి ఆటంకంగా మారిందని అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి ఆ ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతంగా ఉండటం వల్ల అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదని, ఈ గ్రామాలను భద్రాచలంలో కలిపితే విస్తీర్ణం పెరగడంతో పాటు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

