కలం, ఖమ్మం బ్యూరో : జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) సమక్షంలో వలసల జోరు ఊపందుకుంది. కూసుమంచి మండలంలోని మునిగేపల్లి సర్పంచ్ గంగా స్రవంతి మంత్రి సమక్షంలో ‘హస్తం’ గూటికి చేరారు. ఐదు నెలల క్రితం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తన సత్తా చాటిన గంగా స్రవంతి, ఇప్పుడు అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్ బాట పట్టారు. ఆమె తో పాటు ఐదుగురు వార్డు సభ్యులు, గ్రామ ముఖ్య నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి.
ఈ భారీ చేరికలతో ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా సర్పంచ్ గంగా స్రవంతి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తున్న మార్పులు, మంత్రి పొంగులేటి గారు నియోజకవర్గంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను చూసి ఈ నిర్ణయం తీసుకున్నాం. గ్రామాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వయంగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ, పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేసే వారందరికీ కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. పాలేరును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఒక గ్రామానికి చెందిన సర్పంచ్, మెజారిటీ వార్డు సభ్యులు అధికార పార్టీలో చేరడం కూసుమంచి మండల రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ చేరికలతో పాలేరులో మంత్రి పొంగులేటి హవా పెరగడంతో పాటు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేస్తారని, నాయకులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

