కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భరించలేని ఎండలతో అల్లాడిపోయిన జనాలు ఇక నుంచి ఉపశమనం పొందనున్నారు. తొలకరి వానలకు గుర్తుగా భావించే మృగశిర కార్తె (Mrigasira Karte) ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతుంది. తెలుగు పంచాంగం ప్రకారం, సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తెగా పిలుస్తారు. ఎండలు తగ్గి ఆకాశం చల్లబడి, వర్షాలు పడటం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచే రైతులు వ్యవసాయ పనులు కూడా మొదలుపెడుతుంటారు. అయితే మృగశిర కార్తె అనగానే ఎక్కువగా చేపలు తినడమే గుర్తొస్తుంటుంది. దీని వెనుక శాస్త్రీయ నేపథ్యం కూడా ఉంది.
ఆస్తమా వచ్చే అవకాశం..
ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత నిరంతరం వేడిగా ఉంటుంది. అలాంటిది మృగశిర కార్తె రాకతో వాతావరణంలో మార్పులు వచ్చి శరీరం చల్లబడుతుంటుంది. ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతే.. శరీరంలోనూ అనేక మార్పులు వస్తుంటాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చేపలు తినడం వలన ఇవి రాకుండా అడ్డుకోవచ్చు. అందులోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ప్రొటీన్లు తక్షణ రోగనిరోధక శక్తిని పెంచుతుంటాయి. అందుకే, ఈ కార్తెలో చేపలు ఎక్కువగా తీసుకుంటుంటారు. చేపలు తినలేని వారు బెల్లం, ఇంగువ కలిపిన మిశ్రమం, చింతచిగురు వంటకాలను తిన్నా ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

