కలం/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు (Manuguru) ప్రజలకు ఎంపీ బలరాంనాయక్ శుభవార్త చెప్పారు. వెంటనే పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్ఆర్ఐ, సీటీ స్కాన్ వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. శనివారం ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ వసతుల గురించి సూపరిండెంట్ గౌరీ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్కానింగ్ పరికరాలు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని గమనించి, వెంటనే సింగరేణి జీఎమ్తో ఫోన్లో మాట్లాడారు.
మణుగూరు (Manuguru) పట్టణంలో వేలసంఖ్యలో సింగరేణి కార్మికులు ఉంటున్నారని కాబట్టి సింగరేణి నిధుల నుంచి స్కానింగ్ పరికరాలు సమకూర్చడం బాధ్యతగా భావించాలని ఎంపీ గుర్తు చేశారు. అంతేకాకుండా ఎంతో మంది నిరుపేదలైన ఆదివాసీలు, గిరిజనులు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకుంటారని ఎంపీ తెలిపారు. కాబట్టి సీఎండీకి తను కూడా లేఖ రాస్తానన్నారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా హాస్పిటల్ అభివృద్ధికి చర్యలు చేపట్టేలా అధికారులతో మాట్లాడుతానని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇవ్వడం గమనార్హం.

