కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం శాసనసభ సభ్యులు, కూనంనేని సాంబశివరావుపై తాను కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తమని, సదరు దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి (MP Raghu Ram Reddy) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వార్త ఛానల్లో ప్రసారమైన వార్తలపై మంగళవారం అయన వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్యే కూనంనేని ఇసుక దందాలు, భూకబ్జాలు చేస్తున్నారని తాను ఫిర్యాదు చేసినట్లు సదరు ఛానల్లో ప్రసారం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కేవలం కాంగ్రెస్ ఎంపీలను పిలిపించి ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మాత్రమే వివరణ తీసుకున్నారని ఎంపీ రఘురాం రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వివరాలు సేకరించారని, అందులో భాగంగానే తాము కూడా పాల్గొన్నామని తెలిపారు.
ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే తాము మీనాక్షి నటరాజన్కు కూలంకషంగా వివరించామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి తప్పుడు వార్త ప్రసారం చేయించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా ఉన్నాయని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రామసహాయం రఘురాం రెడ్డి వివరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

