కలం, హనుమకొండ : వరంగల్ పార్లమెంట్ పరిధిలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) గ్యాస్ కనెక్షన్ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ కడియం కావ్య (Kadiyam Kavya) కోరారు. లోక్సభలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, రీఫిల్ సబ్సిడీ, గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమె.. పేద మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చడంలో ఉజ్వల పథకం కీలకమని పేర్కొన్నారు.
అయితే కనెక్షన్లు ఇవ్వడం మాత్రమే కాకుండా, పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా గ్యాస్ సిలిండర్లను క్రమం తప్పకుండా రీఫిల్ చేసుకునేలా సబ్సిడీని కొనసాగించి, అవసరమైతే పెంచాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, 2026 జూలై 1 నాటికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో 1.22 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. గత మూడేళ్లలో 5,847 కొత్త కనెక్షన్లు మంజూరైనట్లు కేంద్రం తెలిపింది.

