కలం, జగిత్యాల : జగిత్యాల(Jagtial) జిల్లా వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ధూపదీప నైవేద్య అర్చకుడు సింహాచలం జగన్(Simhachalam Jagan) అకాల మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఆయన కుటుంబానికి పలువురు అండగా నిలిచారు. ధూపదీప నైవేద్య అర్చక సమాఖ్య సంక్షేమ సంఘంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, ధర్మపురి నియోజకవర్గ నాయకత్వం ఆర్థిక సాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించింది.
జగన్ కుటుంబానికి బీఆర్ఎస్ రూ.21.36 లక్షల ఆర్థిక సాయం
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం గొల్లకోట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి పార్టీ అధిష్టానం, నియోజకవర్గ నాయకత్వం అండగా నిలిచింది. ఇటీవల అకాల మరణం చెందిన జగన్ చిత్రపటానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అధిష్టానం ప్రకటించిన రూ.10 లక్షల సాయంతో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సేకరించిన రూ.11,36,000 కలిపి మొత్తం రూ.21,36,000 ఆర్థిక సహాయాన్ని శనివారం జగన్ కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతానికి సింహాచలం జగన్ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జగన్ సేవలను గుర్తించి ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జగన్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అర్చక సంఘం ఆధ్వర్యంలో రూ.1.08 లక్షల సాయం
జగిత్యాల జిల్లా, రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సమాఖ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగన్ కుటుంబానికి రూ.1,08,720 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ధూపదీప నైవేద్య సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ ఎన్. మహేంద్రాచార్య, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు ఓరుగంటి మాధవాచార్యులు, గ్రామ పురోహితులు ఆరుట్ల రంగాచార్యులు, ఇతర అర్చకులు పాల్గొన్నారు.

