కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలో ఆదివారం భారీ వర్షం (Karimnagar Heavy Rain) ముంచెత్తింది. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి భారీగా చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
గంట పాటు కురిసిన వర్షానికి జ్యోతి నగర్, ఆర్టీసీ వర్క్ షాపు, సీతారాంపూర్, భగత్ నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. గీతా భవన్ చౌరస్తా నుంచి టూ టౌన్ పిఎస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. డ్రెయిన్ పూడికతీత సరిగ్గా లేకపోవడం వల్లే నీరు నిలిచిపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు
కరీంనగర్ నగరంలో ఆదివారం కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు ప్రాంతాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కలిసి సంయుక్తంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. నగరంలోని 52, 53, 59, 60, 64వ డివిజన్లతో పాటు సాయినగర్, కాశ్మీర్ గడ్డ, ముకరంపుర, జ్యోతినగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల నుండి నీరు త్వరగా పోయేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ నీరు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రాబోయే వర్షాకాలం నాటికి ఈ సమస్యలన్నింటినీ దూరంచేస్తామని వెల్లడించారు. డిఆర్ఎఫ్ బృందాలు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ కార్మికులు, జవాన్లు అంతా కలిసికట్టుగా శ్రమించి ఎక్కడా నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టారు.

