కలం, వెబ్ డెస్క్: ఇటీవల తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ (Vijay) ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించిన సందర్భంగా నటుడు విశాల్ (Actor Vishal) ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినిమా టెక్నాలజీ, సినిమాటోగ్రఫీ చట్టం వంటి కీలక శాఖలను నూతన మంత్రి రాజ్ మోహన్కు కేటాయించడంపై విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను గట్టెక్కించడానికి ఎన్నో సంస్కరణలు అవసరమని విశాల్ పేర్కొన్నారు. పరిశ్రమలో ఉన్న సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగిస్తే నిర్మాతలు, నిర్మాణ సంస్థల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చి 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో భాగమైన విజయ్కే ఇండస్ట్రీ కష్టాలు బాగా తెలుసునని, కాబట్టి ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు.
గత తొమ్మిదేళ్లుగా తాము చేస్తున్న డిమాండ్లను ఈ సందర్భంగా విశాల్ సీఎం విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రేక్షకులకు రూ.30కే టికెట్ లభించేలా, ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేలా ప్రభుత్వ టికెటింగ్ విండోను పెట్టాలని కోరారు. వన్ ఇండియా, వన్ టాక్స్ నియమానికి విరుద్ధంగా రెండు పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని, కాబట్టి స్థానిక సంస్థల పన్నును వెంటనే రద్దు చేయాలని కోరారు. అలాగే ప్రతి ఏటా చిన్న సినిమాలకు ఇచ్చే సబ్సిడీని ప్రస్తుతం ఇస్తున్న నామమాత్రపు మొత్తం నుంచి పెంచాలని విన్నవించారు. మంత్రి రాజ్ మోహన్ను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం ఒక పరిశ్రమ బిడ్డగా తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నానని సీఎం స్పష్టం చేశారు. దీనిపై సీఎం విజయ్ స్పందించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

