కలం, నల్లగొండ బ్యూరో : వంద ఓట్ల ఓనర్ను చూసి మాత్రమే భయపడుతానని, ఎవరో వచ్చి ఏదో చెబితే వినని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తెలిపారు. భువనగిరి జిల్లా డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కోసం వచ్చిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. పదవి తీసుకోవడం గొప్ప కాదు… దాని నిలబెట్టుకోవడం గొప్ప అన్నారు. మనకి నచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వడం కాదని, ప్రజల మధ్యలో ఉండే వారికి ఇస్తే పార్టీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు పాత కక్షలతో నాయకుల మధ్యలో సమన్వయం లేదని, ఇప్పుడు ఎన్నికలు లేవని, పార్టీని పటిష్టం చేయాలని చామల సూచించారు.
ఇచ్చిన పథకాల గురించి కూడా చెప్పుకునే పరిస్థితి నాయకులకు లేకుండా పోయిందని తెలిపారు. 90 మందికి పథకాలు వచ్చినా.. రాని పది మందితో సోషల్ మీడియాలో వ్యతిరేకత చూపెడుతున్నారని మండిపడ్డారు. కొన్ని శక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన (Musi Rejuvenation) చేస్తే మంచి పేరు వస్తుందని అసత్య ప్రచారాలు చేస్తూ వారి అక్కసు వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. పని చేస్తేనే గుర్తింపు.. నేను పని చేయకపోయినా ఎంపీ ఎవరో అనే పరిస్థితి వస్తుందని చెప్పారు. నేను మొదటిసారి గెలవడం వల్ల అంతకుముందు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లేకపోవడంతో పార్టీ గుర్తు తో గెలిచానని, మళ్లీ గెలవాలంటే.. నా వర్క్ ప్రోగ్రెస్తోనేనని, మంచి చేయకపోతే వీపుపై ప్రజలు గుద్దుతారని ఎంపీ చామల (MP Chamala) చెప్పుకొచ్చారు.

