హరీష్ రావు పగటి కలలు కంటున్నారు: ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు (Harish Rao) నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా తప్పుపట్టారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ (BRS) వైఫల్యాలను, బీజేపీ (BJP)తో ఆ పార్టీ కుమ్మక్కైన తీరును ఎండగట్టారు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామని, మామ తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతానని హరీష్ రావు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ ప్రజలు మీ కుటుంబ పాలనను విస్మరించి, కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేశారని దుయ్యబట్టారు. గత పదేళ్ల మీ పాలన తెలంగాణకు ఎప్పటికీ మర్చిపోలేని గాయం మిగిల్చింది అని చామల విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దక్షిణ భారతదేశ ప్రజలు ఏకం అవుతుంటే హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలవడానికి బీఆర్ఎస్ చేసిన ‘క్రాస్ ఓటింగ్’ కారణమని చామల ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించాలనే కక్షతో బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి అవయవదానం చేసిందని, హరీష్ రావు మాట్లాడుతున్న అసలు క్రాస్ బ్రీడ్ విధానం ఇదేనని ఆయన ఆరోపించారు.

పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా లేని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీల పనితీరును విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడాన్ని తప్పుపట్టడంపై చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హరీష్ రావు ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిస్తే రాజకీయాలు చేయడం మీకే చెల్లిందంటూ మండిపడ్డారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని ఎంపీ (MP Chamala) గుర్తు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరం కలిసి స్పీకర్ వద్దకు వెళ్లి తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మకర్ ద్వార్ వద్ద ఆందోళన చేపట్టి, స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. మేము పార్లమెంటులో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుంటే, మీరు ఇక్కడ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుగా ప్రొజెక్ట్ చేస్తున్న బీజేపీ కుట్రలను కూడా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఎండగట్టాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>