కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా పోలీసు ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్క్వార్టర్స్లో (AR Headquarters) శనివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) కానిస్టేబుళ్లు, హోంగార్డులతో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధి నిర్వహణకు సంబంధించిన అంశాలు, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మద్యం, బెట్టింగ్, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఇవి వ్యక్తిగత జీవితంతో పాటు విధి నిర్వహణపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలు ఉంటే అధికారులతో చర్చించి పరిష్కారం పొందాలని ఎస్పీ సూచించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా తగిన సమయం కేటాయించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా పోలీసు సిబ్బంది తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

