కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత జగన్ ను విమర్శించిన టీడీపీ నేత బీటెక్ రవిపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బీటెక్ రవి .. జగన్ ను వాడు వీడు అనే లెవల్లో వ్యాఖ్యానించాడని, అలా అతని గురించి తాము మాట్లాడాలంటే ఎంత సేపు? అన్నారు. ఈ క్రమంలోనే ”నువ్వెంత.. నీ బతుకెంత” అని బీటెక్ రవిపై ఫైర్ అయ్యారు. ”ఇసుక, ముగ్గరురాయికి కన్నం వేసి బతికేవాడివి.. అలాంటి నువ్వు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో బీటెక్ రవి” అని ఆగ్రహించారు.
వైసీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?
తాము అధికారంలో ఉన్నప్పుడు విజయ సాయి రెడ్డి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవికి బేరం పెట్టలేదా? అని బీటెక్ రవిని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి అమ్ముకోవడానికి రూ.12 కోట్లు ఇప్పించండని అడగలేదా? .. ఒప్పుకుంటే వైసీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆనాడు జగన్ అలాంటి పనులు చేయనని తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు బీటెక్ రవిది అని ఆరోపించారు. ఇలాంటి వారందరికీ మళ్లీ తాము అధికారంలోకి రాగానే సరైన సమాధానం చెపుతామని హెచ్చరించారు.

