కలం, నిజామాబాద్ బ్యూరో : జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం స్థాపన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చల్గల్ లోని పది ఎకరాల భూమిని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కేటాయించారని, ఆ భూమిని కేంద్రీయ విద్యాలయం పేరిట బదలాయింపు చేయాలని డిమాండ్ చేశారు. కేవీఎస్ నిబంధనల ప్రకారం కనీసం 5 ఎకరాల భూమి అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం 2 ఎకరాల భూమిని మాత్రమే ఆమోదించడం దురదృష్టకరమని విమర్శించారు.
చెల్గల్ గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం 10 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం, కేంద్రీయ విద్యాలయానికి మాత్రం సరైన భూమి ఇవ్వకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని తప్పుబట్టారు. నర్సింగపూర్ సమీపంలో ప్రతిపాదించిన స్థలం రహదారి, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాటు చెత్త నిల్వ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల విద్యాసంస్థకు పూర్తిగా అనర్హమని అభిప్రాయ పడ్డారు. అందువల్ల చెల్గల్ గ్రామంలోని 10 ఎకరాల భూమిని వెంటనే కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలని, లేకపోతే జగిత్యాల విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

