కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) స్పందించారు. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు అత్యధికంగా 13 క్యాచ్లు వదిలేసిందని, ఫీల్డింగ్పై జట్టు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఇలా జరగడం చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరగనున్న రెండో సెమీఫైనల్ ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మోర్కెల్ మాట్లాడారు.
వరల్డ్కప్ ప్రారంభానికి ముందే ఫీల్డింగ్ను కీలక అంశంగా గుర్తించి ఆటగాళ్లు కష్టపడుతున్నారని మోర్కెల్ తెలిపారు. వెస్టిండీస్తో జరిగిన గత మ్యాచ్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ సులువైన క్యాచ్లను వదిలేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ఏ ఆటగాడు కావాలని క్యాచ్లు వదలడని, దీనికి కారణం ఆటగాళ్ల మానసిక స్థితి అని తాను ఖచ్చితంగా చెప్పలేనని వివరించారు. మైదానంలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నప్పటికీ, మ్యాచ్ పరిస్థితుల్లో ఇలా జరగడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్లో మెరుగ్గా ఉందని, ముఖ్యంగా టామ్ బాంటన్ ఈ టోర్నీలో 10 క్యాచ్లతో సత్తా చాటుతున్నాడని మోర్కెల్ (Morne Morkel) గుర్తుచేశారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. మైదానంలోని కీలకమైన ‘హాట్ జోన్స్’లో అత్యుత్తమ ఫీల్డర్లను ఉంచడంపై దృష్టి పెడుతున్నామని, ఓవర్ రేట్ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటగాళ్లే చొరవ తీసుకుని సరైన స్థానాల్లో ఉండాలని కోరారు.
తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ విజేత.. మార్చి 8 ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కీవీస్తో తుది పోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తమ లోపాలను సరిదిద్దుకుని పటిష్టంగా బరిలోకి దిగుతున్నాయి.

