కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) పట్టణంలో వానర సైన్యం స్వైర విహారం చేసింది. కోతుల గుంపు వెంటపడడంతో తప్పించుకొనే ప్రయత్నంతో గణేష్ (21) అనే యువకుడు బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడు. గణేష్ అదృష్టవశాత్తూ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నర్సాపూర్ పట్టణంలో ఇటీవల కాలంలో కోతుల దాడులు పెరిగాయని, కోతుల నుండి రక్షణ కల్పించాలని నర్సాపూర్ వాసులు కోరుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కోతుల గుంపులు జనావాసాల్లోకి వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

