కలం, జనగామ: జనగామ పట్టణంలో కోతులు బీభత్సం సృష్టించాయి. వంశీ వాటర్ ట్యాంక్ సమీపంలో శనివారం సాయంత్రం ఏబీవీపీ డిగ్రీ కాలేజీ గల్లీలో నివాసం ఉంటున్న ఎల్లయ్య అనే వ్యక్తిపై సుమారు 10 కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఎల్లయ్య స్థానిక ఆర్టీసీ డిపోలో క్లీనర్గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 6:20 గంటల సమయంలో ఆయన తన డ్యూటీకి వెళ్తుండగా, ఒక్కసారిగా కోతుల గుంపు మీద పడి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. నివాస ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఒంటరిగా వెళ్లాలంటేనే భయం వేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కోతుల బెడద నుండి తమను కాపాడాలని వారు కోరుతున్నారు.

