కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా(Bhainsa) పట్టణంలో ఈ నెల 11న బైపాస్ వంతెన కింద అనుమానాస్పద స్థితిలో లభ్యమైన యువకుడి మృతదేహం కేసును పోలీసులు 24 గంటలలో ఛేదించారు. పాత డబ్బుల లావాదేవీలే ఈ హత్యకు (Money Dispute Murder) కారణమని అదనపు ఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. భైంసా పట్టణంలోని నాయాబాదకు చెందిన మహ్మద్ నసీర్ (27) మృతదేహం ఈ నెల 11న బైపాస్ వంతెన కింద లభ్యమైంది. మృతదేహంపై గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో నసీర్కు స్నేహితుడైన సాఫ్రాన్తో పాత డబ్బుల విషయంలో విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 10న రాత్రి ఇద్దరూ కలిసి ఆటోనగర్లోని ఓ హార్డ్వేర్ దుకాణానికి వెళ్లగా, అక్కడ డబ్బుల విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో సాఫ్రాన్ నసీర్ను హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ వెల్లడించారు. హత్య అనంతరం నిందితుడు రాత్రంతా అక్కడే ఉండి, మరుసటి రోజు తెల్లవారుజామున మృతదేహాన్ని ఓ బాక్సులో ఉంచి బైపాస్ వంతెనపై నుంచి కింద పడేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి మొబైల్ ఫోన్ వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు సాఫ్రాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి, ఘటనలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని అదనపు ఎస్పీ సాయి కిరణ్ అభినందించారు.

