కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ (Modi)పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం ఈ సారి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కూచ్లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నిస్పక్షపాతంగా పోలింగ్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. బీజేపీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారని.. తన బహిరంగసభలకు భారీగా జనం తరలివచ్చారని.. రోడ్షోలకు కూడా జనం వచ్చారని చెప్పుకొచ్చారు. బెంగాల్ ప్రజలు ఇంతకాలం భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారని.. వారి భయం పోగొడతామని మోదీ హామీ ఇచ్చారు.
మీ రక్షణకోసం ఓటు వేయండి
పశ్చిమబెంగాల్లో (West Bengal) ఎన్నో ఏండ్లుగా అరాచకపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు రక్షణలేకుండా పోయిందన్నారు. ప్రజలు తమ భద్రతకోసం రక్షణ కోసం, తమ సంస్కృతిని కాపాడుకొనేందుకు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బెంగాల్లో సిండికేట్రాజ్ రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రతి పథకంలో, ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. అందుకే ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సారి పశ్చిమబెంగాల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సరికొత్త బెంగాల్ను నిర్మిస్తామన్నారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఎంసీ (TMC) తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ అంటే భయపడుతున్నారని.. వేర్పాటువాదులను చూస్తే భయపడుతున్నారని పేర్కొన్నారు. వారి భయాన్ని బీజేపీ తొలగిస్తుందని మోడీ (Modi) భరోసా ఇచ్చారు.
Read Also: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి 5 కిలోల సిలిండర్లు
Follow Us On: Instagram

