కలం, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) త్వరలోనే ఖమ్మం జిల్లా పర్యటించబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురం (మత్కెపల్లి) వద్ద నిర్వహించనున్న సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకల మార్గాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యవేక్షించారు.
త్వరలోనే తేదీ ప్రకటన..
భారీ వర్షాలు, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో వాయిదా పడిన రైతు భరోసా ప్రారంభోత్సవ బహిరంగ సభకు ప్రస్తుతం వాతావరణం, గ్రౌండ్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. సభా ప్రాంగణం దాదాపు ఎండిపోయిందన్నారు. ఈ మేరకు నివేదికను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం త్వరలోనే సీఎం పర్యటన తేదీని అధికారికంగా ఖరారు చేస్తుందని, వెంటనే ప్రజలకు సమాచారం అందిస్తామని చెప్పారు. అప్పటివరకు అన్ని శాఖల అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉండి ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి..
సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున సభా వేదిక నిర్మాణం, హెలిప్యాడ్, పార్కింగ్, ప్రవేశ నిష్క్రమణ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తాగునీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు భద్రతా బందోబస్తును సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

