కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణలోకి అడుగు పెట్టాలంటే ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ (Balmoor Venkat) వెంకట్ డిమాండ్ చేశారు. రేపు తాము పర్యటన ఎక్కడ అడ్డుకుంటామనే భయంతోనే తన హైదరాబాద్ టూర్ రద్దు చేసుకున్నాడని విమర్శించారు. ఏపీ, తెలంగాణ విభజనను తేజస్వీ సూర్య భారత్, పాకిస్థాన్ విభజనతో పోల్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని పార్లమెంట్ వేదికగా కించపర్చారని మండిపడ్డారు. అమరుల ఆత్మ బలిదానాలను అవహేళన చేసేలా ఆయన చేసిన వ్యాఖ్యలను తాము మరచిపోలేమని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. మోదీ నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు మొదటి నుంచీ తెలంగాణ అంటే వారికి ఇష్టం ఉండదని.. విద్వేషంతోనే ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఈ గడ్డపై నిజంగా ప్రేమ ఉంటే.. తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించే వారినే ఆహ్వానించాలన్నారు. ముందుగా తేజస్వీ సూర్యతో క్షమాపణ చెప్పించి, హైదరాబాద్లో పర్యటించుకునేలా చేయాలని సూచించారు.

