కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచినా రైతాంగానికి చేసింది శూన్యమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి (MLC Anji Reddy) విమర్శించారు. నమ్మి ఓటేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంజి రెడ్డి మాట్లాడుతూ.. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వారాల తరబడి కళ్లాలపైనే మొలకెత్తుతోందన్నారు. కొనుగోలు సరిగా జరగక, అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతుందన్నారు. అన్నదాతల సమస్యలు పట్టించుకునే తీరిక ప్రభుత్వ యంత్రాంగానికి లేదా అని ఆయన (MLC Anji Reddy) ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి, యుద్ధ ప్రాతిపదికన ప్రతీ గింజా కొనుగోలు చేయాలని, తరుగు పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలన్నారు. తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పించి 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అని అంజిరెడ్డి హెచ్చరించారు.
Read Also: కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి
Follow Us On: Sharechat

