కలం, వెబ్ డెస్క్: భారత అథ్లెటిక్స్ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదైంది. జాతీయ సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కూటమిలో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఏకంగా మూడు జాతీయ రికార్డులను బద్దలు కొట్టారు. 100 మీటర్లు, 400 మీటర్ల పరుగుతో పాటు డెకాథ్లాన్ విభాగంలో సరికొత్త మైలురాళ్లు నమోదయ్యాయి. పంజాబ్ రన్నర్ గుర్విందర్ సింగ్ (Gurvinder Singh) 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించారు. 10.10 సెకన్ల లోపే రేసును ముగించిన తొలి భారతీయ స్ప్రింటర్గా ఆయన చరిత్రకెక్కారు. ఒడిశా రన్నర్ అనిమేష్ కుజూర్తో సాగిన హోరాహోరీ పోరులో గుర్విందర్ పైచేయి సాధించారు. తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించడానికే ఈ రికార్డు సాధించానని గుర్విందర్ సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు, తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల యువ రన్నర్ విశాల్ టి.కె 400 మీటర్ల రేసులో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన కేవలం 44.98 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని, 45 సెకన్ల లోపు పరుగును ముగించిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఈ ప్రదర్శనతో ఈ సీజన్లో ఆసియాలోనే అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసిన అథ్లెట్గా విశాల్ రికార్డుకెక్కారు. అంతర్జాతీయ వేదికలపై రాణించగలననే నమ్మకం తనకు ఉందని విశాల్ చెప్పారు. ఇదే వేదికపై ఆసియా క్రీడల రజత పతక విజేత తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్ విభాగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు.
10 రకాల క్రీడలతో కూడిన ఈ కఠినమైన పోటీలో ఆయన ఏకంగా 8,057 పాయింట్లు సాధించారు. భారతదేశం తరఫున డెకాథ్లాన్లో 8,000 పాయింట్ల మార్కును దాటిన మొదటి అథ్లెట్గా తేజస్విన్ నిలిచారు. ఈ అద్భుత విజయాల ద్వారా గుర్విందర్ సింగ్ (Gurvinder Singh), విశాల్ టి.కె, తేజస్విన్ శంకర్ ముగ్గురూ కూడా 2026 కామన్వెల్త్ క్రీడల అర్హత మార్కులను విజయవంతంగా అధిగమించారు. మన అథ్లెట్లు దేశీయ వేదికలపై అంతర్జాతీయ స్థాయి టైమింగ్స్తో రికార్డులు సృష్టించడం భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు తెచ్చిపెడుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
Read Also: ఆసియా అండర్-20 మీట్కి ఏపీ రన్నర్ ఎంపిక
Follow Us On: Instagram

