కలం, మహబూబ్నగర్ బ్యూరో : అంగన్వాడీ సేవల్లో పారదర్శకతతో పాటు కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడి టీచర్లకు యెన్నం స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తాను ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఆయన (MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు.
నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు భవనాల కొరతతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఆ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సిబ్బంది తమ కేంద్రాలకు సంబంధించిన ఏ సమస్యలైనా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని, జూన్ నెల నుంచి వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ప్రసవానంతరం వారికి అవసరమైన యెన్నం హెల్త్ కిట్లు అందజేస్తున్నామని ఆయన తెలిపారు.
పేద, బలహీన వర్గాల ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అధిక ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్యం పొందాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, బస్తీలలో నివసించే ప్రజలకు ఈ సమాచారం చేరవేయాలని కోరారు. అంగన్వాడీ సిబ్బందికి అందజేసిన స్మార్ట్ ఫోన్ల ద్వారా వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
మన పిల్లల భవిష్యత్తు – మన బాధ్యత : యెన్నం
మన పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించేలా చేయడం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఘనంగా సన్మానించారు. నియోజకవర్గానికి చెందిన ఆరు గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన 38 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో విద్యపై సరైన దృష్టి లేకపోయిందని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి స్కూల్, గురుకులం, హాస్టల్ను పరిశీలిస్తూ, అక్కడ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోనే ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, లా కాలేజీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, స్థానిక విద్యార్థులకు సమీపంలోనే నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

