ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

కలం, నల్లగొండ బ్యూరో: నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్ప‌ష్టం చేశారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో వేముల వీరేశం కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ప్రధాన ప్రాజెక్టులైన బ్రాహ్మణవెల్లంల, అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్, అలాగే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనుల ప్రస్తుత పరిస్థితిని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై సమగ్రంగా సమీక్షించి, పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. నిర్దేశించిన కాల పరిమితిలోనే పనులన్నీ పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ పనులను వేగవంతం చేయడంతో పాటు, పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని తెలిపారు. రాబోయే కాలంలో రైతులకు సాగునీటి పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>