కలం, నకిరేకల్ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ (Nakrekal) ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కట్టంగూర్, చిట్యాల, నార్కట్పల్లి మండలాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు ప్రక్రియను, తూకాలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిట్యాల పట్టణంలోని వరలక్ష్మి మిల్ వద్ద గల ధాన్యం దిగుమతి కేంద్రాన్ని సందర్శించి, నిల్వ, రవాణా సౌకర్యాలను సమీక్షించారు. నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. అధికారులు కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటలలోనే రైతుల ఖాతాలలో నగదు జమ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Read Also: ‘చంద్రబాబుతో నా బంధం ఇదే’.. రాహుల్ ను ప్రధాని చేస్తా: సీఎం రేవంత్
Follow Us On: Instagram

