కలం మెదక్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (MLA Sunitha Lakshma Reddy) డిమాండ్ చేశారు. మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ (Bandi Bhageerath) పై పోక్సోకేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి తక్షణమే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే సునీతా అన్నారు. కేసు నమోదై 48 గంటలు గడుస్తున్నా బండి భగీరథ్ను ప్రభుత్వం అరెస్టు చేయక పోవడంతో ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడితే సీఎం గాని, మహిళ మంత్రులు సీతక్క, కొండా సురేఖ స్పందించక పోవడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నయని, క్రైం రేటు ఎక్కువ అవుతుందని ఆరోపించారు. హొంశాఖను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించక పోవడమే నేరాల పెరుగుదలకు కారణమని ఆమె మండిపడ్డారు. చట్టం అందరకి సమానమని, కేంద్ర మంత్రి కొడుకు కావడంతో అరెస్టు చేయకుండా ఆలస్యం కాలం గడపడం సరికాదని హితవు పలికారు. వెంటనే బండి భగీరథ్ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.

