కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని అమీర్పేట్ (Ameerpet)లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (Naveen Yadav) పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో స్పష్టంగా తెలియడం లేదన్నారు. కొంతమంది షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు చెప్తున్నారని, మరికొందరు రెస్టారెంట్ వేడి వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారని వెల్లడించారు. ఇదే కాకుండా ఇటీవల యూసఫ్గూడలో కూడా అధిక వేడి వల్ల ప్రమాదం జరిగిందన్నారు. సిటీలో చాలా చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
అయితే అన్ని శాఖల అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన భవనంలో ఉన్న సుమారు 25 నుంచి 30 షాపులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే ఫైర్ సేఫ్టీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

