కలం, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy ) అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జౌళి గ్రామంలో రూ. 9 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దడం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు మెరుగైన విద్యను పొందగలరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

