కలం, వెబ్ డెస్క్ : కడప (Kadapa) జిల్లా ముత్తరాసుపల్లె(Muthrasupalle) ప్రాథమిక పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (Madhavi Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత సంతృప్తికరంగా లేదని గమనించిన ఎమ్మెల్యే, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, భోజనం, పాఠశాల వసతులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
పాఠశాలలోని విద్యార్థినుల మరుగుదొడ్లను పరిశీలించిన ఆమె, అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన శుభ్రత, నిర్వహణ లేకపోవడం పట్ల తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేకపోవడం గమనించిన ఎమ్మెల్యే, త్వరలోనే P4 మోడల్లో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

