కలం, యాదాద్రి భువనగిరి: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని లోక్ భవన్ వద్ద నిర్వహించిన ‘చలో లోక్ భవన్’ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఖండించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి ప్రజాస్వామ్యవాదిపై ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ సహించదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

