కలం, నిజామాబాద్ బ్యూరో: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని, అవసరమైన వారికి నిమ్స్లో ఎల్ఓసీ((Letter of Credit – LoC) అందజేస్తున్నట్లు నిజామాబాద్ (Nizamabad) అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పలువురికి ఎల్ఓసీ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజక వర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాయత్రి నగర్కు చెందిన పెంటయ్య నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే సబ్బని శ్రీనివాస్ మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున ఇద్దరికి కలిపి రూ.6 లక్షల విలువైన ఎల్ఓసీలు అందజేశామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడటమే తన కర్తవ్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

