కలం, కరీంనగర్ బ్యూరో: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి (Peddapalli) ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (Chinthakunta Vijaya Ramana Rao) అన్నారు. పట్టణంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్లో నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష , డీసీపీ రామ్ రెడ్డి, ఉన్నత అధికారులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. అనంతరం ఓదెల మండలం పోతకపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.
పెద్దపల్లి ఆసుపత్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి 4 అవార్డులు సాధించిందని అన్నారు. ఓపీ సంఖ్య 280 నుండి 900కు, మాసంలో ప్రసవాలు 40 నుండి 250కు పెరిగినట్లు పేర్కొన్నారు. కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఎంఆర్ఐ స్కాన్, సీటీ స్కాన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నామని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే చికిత్సను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్, కార్డియాలజీ, 2డి ఎకో వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి కోతలు లేకుండా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. రైతులు పంట మార్పుపై దృష్టి పెట్టాలని, వరి, మొక్కజొన్నలతో పాటు ఇతర పంటలను కూడా పండించాలని సూచించారు. మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం మక్కాజొన్న రైతులకు మద్దతు ధర ఇస్తోందని తెలిపారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్ల బోనస్ , అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు అందిస్తుందని ఎమ్మెల్యే విజయరమణ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఆర్డీవో, ప్రభుత్వ ఉన్నత అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

