కలం, వెబ్ డెస్క్: ఏపీ విద్యా వ్యవస్థలో (AP Education) సమూల మార్పులు చేయాలని మంత్రి లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే.. ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి, అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉందో వారితోనే అధ్యయనం చేయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారిని సింగపూర్కు పంపిస్తున్నారు. కాసేపటి కిందటే వీరంతా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు బయలుదేరారు. రేపటి నుంచి 9వ తేదీ వరకు అక్కడ పర్యటించబోతున్నారు.
పరిశీలనా అంశాలపై మంత్రి దిశానిర్దేశం..
సింగపూర్ పర్యటనలో భాగంగా టీచర్లు డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, బోధనా పద్ధతులపై అధ్యయనం చేయాలని మంత్రి లోకేశ్ వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే, అక్కడి టీచర్ల పనితీరుని సైతం పరిశీలించాలని కోరారు. ఉత్తమ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే మరో ఉత్తమ ఉపాధ్యాయుల టీంను ఫిన్లాండ్ దేశానికి పంపించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విద్యా శాఖ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది.

