కలం, నిజామాబాద్ బ్యూరో: మానసిక అస్థిరతకు గురైన గల్ఫ్ బాధితుడు మొద్దు గంగాధర్కు వైద్యం అందించడానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి (Bhoopathi Reddy) చొరవతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామానికి చెందిన గంగాధర్కు హైదరాబాద్కు చేరిన తర్వాత వైద్యం జరుగనుందని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విదేశంలో ఉన్న గంగాధర్ను స్వదేశానికి రప్పించాలని, వచ్చిన తర్వాత డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) చికిత్స అందించాలని కోరుతూ అతని భార్య సుప్రియ ఈనెల 12న హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో ‘సీఏం స్టేట్ లెవల్ ప్రవాసీ ప్రజావాణి’లో వినతిపత్రం సమర్పించారు. స్వగ్రామంలో కల్తీ కల్లు సేవించే అలవాటు వలన గంగాధర్ దుబాయిలో మానసిక అస్థిరతకు గురయ్యాడు.
ఈ మేరకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి జీఏడీ ఎన్నారై సెల్ అధికారులకు లేఖ రాశారు. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 నిబంధనల ప్రకారం… మొద్దు గంగాధర్ (Gangadhar Medical Treatment)ను హైదరాబాద్ లోని మానసిక ఆరోగ్య సంస్థలో చేర్చుకొని చికిత్స అందిస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్ ఈ నెల 22న ఎన్ఓసీ జారీ చేశారు. “రోగి ఆసుపత్రిలో చేరిన సమయంలో కుటుంబ సభ్యులు లేదా బంధువులు అతనితో ఉండి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉంటే, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 లోని సెక్షన్ 86 ప్రకారం ఫ్యామిలీ వార్డులో చేర్చవచ్చు. కుటుంబ సభ్యులు క్లోజ్డ్ వార్డులో చేర్పించాలని కోరిన పక్షంలో, అందుకు అవసరమైన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.” అని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhoopathi Reddy) ప్రత్యేక చొరవ చూపడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

