కలం, మిర్యాలగూడ: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న విత్తన మేళా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) పిలుపునిచ్చారు. నేటి నుంచి 30వ తేదీ వరకు నిర్వహించబడుతున్న ఈ విత్తన మేళాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రైతులకు అవసరమైన నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను ఈ మేళాలో అందుబాటులో ఉంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. “ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాలను వినియోగించడం ద్వారానే అధిక దిగుబడులు సాధించగలరు. రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది.” అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) తెలిపారు.
మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ పంటలకు అవసరమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని కోరారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

