కలం, హనుమకొండ : గత పది రోజులుగా మహానగరంలో పేదలు నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేస్తున్నారని (Hut Demolition), మరికొన్ని గుడిసెలను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వామపక్ష పార్టీ నాయకులు (Left Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ కూల్చివేతలను ఆపాలని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ (Hanumakonda) సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా, సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి, ఎంసిపీఐ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజును కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పటికీ, వారి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అదే సమయంలో కిరాయి చెల్లించలేక చెరువుల వద్ద గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న నిరుపేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. గోపాలపురం చెరువు, గుండ్ల సింగారం ప్రాంతాలలో ఇటీవల పేదల గుడిసెలను కూల్చివేశారని తెలిపారు. అదే సర్వే నంబర్లలో ఇతరులు బిల్డింగ్లు కట్టుకొని నివసిస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని అన్నారు. ఈ చర్యల వల్ల పేదలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా కుటుంబాలతో రోడ్డున పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఇందిరమ్మ ఇళ్లు’ పేరుతో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పే ప్రభుత్వం, విరుద్ధంగా వారి గుడిసెలను కూల్చడం (Hut Demolition) హేయమైన చర్య అని విమర్శించారు. తక్షణమే పేదల ఇళ్ల కూల్చివేతను ఆపి, వారు నివసిస్తున్న స్థలాలకు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు సానుకూలంగా స్పందించి, పేదల ఇళ్ల కూల్చివేతను ఆపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Also: హైదరాబాద్లో భారీ చోరీ.. ఏటీఎం క్యాష్తో వ్యాన్ డ్రైవర్ పరార్
Follow Us On : WhatsApp

