కలం, భువనగిరి బ్యూరో: కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడం అత్యంత కీలకమని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి (Anil Kumar Reddy) స్పష్టం చేశారు. మంగళవారం భువనగిరి (Bhuvanagiri) పట్టణంలోని హోటల్ వివేరాలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం విస్తృత స్థాయిలో నిర్వహించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు, నాయకత్వ సమన్వయంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో బలమైన పార్టీ నిర్మాణం ఉండాలని, నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో చేరవేసి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని సూచించారు.
‘సంగఠన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పార్టీని కేడర్ స్థాయిలో బలోపేతం చేసేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నాయకులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, రంగారెడ్డి, సూర్యాపేట, జనగాం జిల్లాల డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, గుడిపాటి నర్సయ్య, దమయంతి, జనగాం, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మునుగోడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఈవీ శ్రీనివాస్ రావు, చైతన్య కృష్ణ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

