కలం, నిర్మల్: హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి (Guru Ravidass Jayanti) ఉత్సవాలు, “కలశ్ వందన్ అభియాన్” కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు రవిదాస్ మహారాజ్ బోధించిన సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
సమాజంలో అందరూ ఒక్కటేనని, జన్మ ఆధారంగా ఎవరూ గొప్పవారు కాదనే సమానత్వ సందేశాన్ని గురు రవిదాస్ మహారాజ్ ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి కూడా శాశ్వత స్ఫూర్తిదాయకమన్నారు. గురు రవిదాస్ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

