కలం, వెబ్ డెస్క్: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ రెండవ దశ సీట్ల జాబితా విడుదల చేసినట్లు హైదరాబాద్ ఎంజేపీ బీసీ (MJP BC Gurukul) గురుకుల విద్యాలయాల సంస్థ వెల్లడించింది. ఇంటర్ మీడియట్ తొలి జాబితాలో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈనెల 4 వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని ఇన్ ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. బ్యాక్లాగ్ సీట్లు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ ఫలితాలను సోసైటీ అధికారిక వెబ్ సైట్ https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home , https://mjptbcwreis.telangana.gov.in లో తమ వివరాలను చూసుకోవచ్చని తెలిపారు. ఎంట్రన్స్ టెస్ట్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని చెప్పారు. విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలనే వివరాలు తెలియ చేస్తారని ప్రకటనలో వివరించారు. మెరిట్ లిస్ట్లో ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సీట్ల కేటాయింపు, భర్తీ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

