కలం, వెబ్ డెస్క్: క్రికెట్లో భారీ మార్పుకు తెరలేచింది. టెస్ట్ ట్వంటీ పేరుతో తీసుకొచ్చిన కొత్త 80 ఓవర్ల ఫార్మాట్లో మహిళలు, పురుషులు ఒకే టీమ్లో కలిసి ఆడనున్నారు. “పారిటీ రూల్” పేరుతో రూపొందించిన ఈ విధానం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు మహిళల, పురుషుల క్రికెట్ వేర్వేరుగా సాగినా.. ఇప్పుడు ఒకే ఫ్రాంచైజీ, ఒకే పాయింట్ల పట్టిక, ఒకే టైటిల్ కోసం కలిసి పోటీ పడేలా కొత్త వ్యవస్థను రూపొందించారు. ప్రతి జట్టులో మహిళల స్క్వాడ్, పురుషుల స్క్వాడ్ ఉంటాయి. ఇద్దరి ప్రదర్శన కూడా జట్టు ఫలితంపై ప్రభావం చూపుతుంది. టెస్ట్ ట్వంటీ ఫార్మాట్లో ఒకే రోజులో నాలుగు ఇన్నింగ్స్లుగా 20 ఓవర్ల చొప్పున మొత్తం 80 ఓవర్లు ఆడిస్తారు.
ఈ కొత్త నిర్మాణమే మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడానికి ఉపయోగపడింది. 13 నుంచి 19 ఏళ్ల యువ ఆటగాళ్ల కోసం రూపొందించిన ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించనుంది. ప్రతి ఏడాది “జూనియర్ టెస్ట్ ట్వంటీ ఛాంపియన్షిప్” నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా క్రికెట్లో సమానత్వానికి కొత్త అర్థం తీసుకొచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు. క్రీడల్లో మహిళలు, పురుషులు కలిసి ఒకే లక్ష్యం కోసం ఆడే కొత్త యుగానికి ఇది ప్రారంభంగా భావిస్తున్నారు.

