కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. ఇప్పుడప్పుడే ఆటకు స్వస్తి పలికే ఉద్దేశం తనకు లేదని, తన తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న స్టార్క్, ఒక ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్టార్క్ గత 16 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలం ఆడాలనే ఉద్దేశంతోనే ఆయన 2025 సెప్టెంబర్లో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుండి టెస్టులు, వన్డేలపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా (759 వికెట్లు) రికార్డు సృష్టించిన స్టార్క్.. షేన్ వార్న్, మెక్గ్రాత్ తర్వాత ఆ స్థానంలో ఉన్నారు. క్రికెట్లో ఉండే పోటీ తత్వం తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఇంకా కొనసాగాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
36 ఏళ్ల స్టార్క్ గత కొంతకాలంగా భుజం, మోచేయి గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ తన శరీరం అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోగలదని ఆయన నమ్ముతున్నారు. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అప్పటికి స్టార్క్కు (Mitchell Starc) 37 ఏళ్లు వస్తాయి. వరల్డ్ కప్ ఆడటం ప్రతి క్రికెటర్ లక్ష్యమని, తాను కూడా అందులో భాగం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిటైర్మెంట్ గురించి ఎటువంటి గడువు పెట్టుకోలేదని, కేవలం ఫిట్నెస్, ఫామ్ను బట్టే నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పేసర్లలో ఒకరైన స్టార్క్ ఇంకా కొన్ని ఏళ్ల పాటు మైదానంలో కనిపిస్తారని తెలియడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
Follow Us On : WhatsApp

